ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
Saturday, August 23, 2014
మట్టి చేసే మేలు..
మట్టి అంటే స్వచ్చత కు మారు పేరు అటువంటి మట్టితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకొంటూ వస్తే చాంతాడంత అవుతుంది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం మాత్రం చెప్పాల్సి వుంది.
త్వరలోనే వినాయక చవితి వస్తోంది. వినాయకుడి పందిళ్లు ఎక్కువగా పెట్టే నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అయితే ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా పెట్టడం ఆనవాయితీ గా వస్తోంది. కానీ ఇటువంటి మెటీరియల్స్ తో కాలుష్యం ఎక్కువగా విస్తరిస్తోంది. అందుచేత ఇటువంటి మెటీరియల్స్ ను దూరం పెట్టాలి. లేదంటే ఎంతో భక్తితో పూజించుకొన్న వినాయకుని ప్రతిమ ద్వారా కాలుష్యం విస్తరిస్తుందంటే..అసలు ఆ దేవుడే సహించడు. అందుచేత చక్కగా మట్టితో వినాయకుడి ప్రతిమలు చేయించుకొని ఉపయోగించుకొందాం..పూజలు అందుకొన్న తర్వాత గణ నాధుడ్ని సాగనంపితే ఆయన సంతోషిస్తాడు. మనకు మంచి జరుగుతుంది. అందుకని గణ నాయకుని ప్రతిమలు తీసుకొనేటప్పుడు కాస్తంత జాగ్రత్త తీసుకొంటే మంచిది.
Tuesday, June 10, 2014
పిల్లలు అక్కడకు ఎందుకు వెళతారంటే..
అప్పనపల్లి పేరు గోదావరి జిల్లాల్లో చాలా మందికి తెలిసి ఉంటుంది. బయట ప్రాంతాల వారికి తెలిసే అవకాశం కాస్త తక్కువ. నాకు మాత్రం చిన్నప్పడే తెలుసు. అది కూడా ఈ జూన్ నెలలోనే తెలిసింది.
ఒక వర్షం కురవని రాత్రి నేను నిద్ర పోయి లేచే సరికి ఇంట్లో అమ్మా, నాన్మ కనిపించలేదు. పనిలో పని మా అక్క కూడా లేదు. మా పక్కింటి అత్త కనిపించింది. తెల్లవారు జామున నాలుగు, నాలుగున్నరకు నాన్న అమ్మ నిద్ర లేచే వారు. అమ్మ ఇంటిని శుభ్రం చేస్తూంటే, నాన్న గారు ఇంటికి కావలసినవన్నీ తెచ్చి పెట్టేవారు. నేను మాత్రం తెల్లవారు జామున 8గంటలకు నిద్ర లేచి అప్పుడే హడావుడిగా రెడీ అయి ఊర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కు పరిగెత్తేవాడిని. అటువంటిది లేచిచూసే సరికి ఇద్దరూ కనిపించ లేదాయే. అప్పుడు మా అత్త చెప్పిన దేమిటంటే.. మా అక్క అప్పుడే ఏడో తరగతి పాస్ అయింది. పాస్ అయితే అన్నవరం వస్తానని మొక్కుకొందట. అప్పట్లో ఏడో తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్నమాట. అందుకని మొక్కు తీర్చటానికి అంతా కలిసి అన్నవరం వెళ్లారు. నాకు కోపం పెరిగిపోయింది. నన్ను వదిలేసి వెళ్లినందుకు కొంత అయితే, అక్కను తీసుకొని వెళ్లటం మరికొంత, మరీ ముఖ్యంగా తన మొక్కు తీర్చటానికి వెళ్లటం ఇంకాస్త కొంత కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇక వెంటనే మాస్టర్ మైండ్ కు పదును పెట్టి స్కెచ్ వేశాను.
సాయంత్రం వాళ్లు ఇంటికి వచ్చే సరికి ప్లాన్ రెడీ చేశాను. ఇంటికి వచ్చి అన్నవరం ప్రసాదం పెడుతుంటే బాంబు పేల్చాను. అక్క ఏడో తరగతి పాస్ అయితే అన్న వరం వస్తానని మొక్కుకొన్నట్లే.. నేను కూడా మొక్కుకొన్నానని చెప్పాను. మూడో తరగతి పాస్ అయితే అప్పనపల్లి వస్తానని మొక్కుకొన్నానని చెప్పాను. మూడో తరగతి పాస్కు మొక్కు ఎందుకు రా అని ఎంత చెప్పినా పంతం వీడలేదు. అమ్మా, నాన్నగారు మాత్రమే కాదు చుట్టుపక్కల వాళ్లు నచ్చ చెప్పినా వినలేదు. పైగా అన్నవరం అంటే జాతీయ రహదారిమీద ఉంటుంది. ఉదయమే బస్ లో వెళ్లి సాయంత్రం వచ్చేశారు. ఇక అప్పనపల్లి అంటే చూసుకో నా సామిరంగా.
అప్పనపల్లి అంటే కోనసీమలోని అమలాపురానికి 30 కిలోమీటర్ల దూరంలోని పల్లెటూరు. అక్కడ కొబ్బరితోటలో బాల బాలాజీ స్వామి కొలువై ఉన్నారు. అక్కడకు వెళ్లాలంటే అమలాపురం లో బస్సు దిగి, అక్కడ నుంచి బోడసకుర్రు దాకా ప్రైవేటు వాహనం మాట్లాడుకొని వెళ్లాలి. అక్కడ పడవ ఎక్కి గోదావరి దాటాలి. ఆ తర్వాత అక్కడ వాహనాలు ఉండవు . గుర్రపు బండ్లు మాత్రం ఉండేవి. ఆ గుర్రపుబండి ఎక్కి గుడికి వెళ్లేసరికి మధ్యాహ్నం అయింది. అక్కడ ఉన్న బాల బాలాజీ స్వామిని దర్శించాక నా మొక్కు తీరింది.అంతకు మించి నా పంతం తీరింది. ఎర్రటి ఎండలోకుటుంబాన్ని అంతలా పరుగులు పెట్టానన్నమాట.
ఇక్కడే ఈ గుడి గురించి మరో మాట చెప్పుకోవాలి. దూర ప్రాంతాల నుంచి అనేక మంది కుటుంబాలతో సహా అప్పనపల్లి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయేది. అక్కడ పల్లెటూర కాబట్టి ఎటువంటి వసతులు ఉండేవి కావు. అందుకని అక్కడ ఒక మోతుబరి రైతు గారు.. .. భక్తులకు ఉచితంగా భోజనం పెట్టించేవారు. అప్పనపల్లి అంటే మద్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందన్న మాట చుట్టుపక్కల ప్రాచుర్యం పొందింది. ఈ సంగతి తెలుసుకొని అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు గారు స్వయంగా ఈ గుడిని దర్శించి ఈ భోజన సౌకర్యాన్ని పరిశీలించారట. ఇంత చిన్న ఊరులో జరగుతున్న అన్న ప్రసాదం పంపిణీ.. తిరుపతిలో ఎందుకు జరగకూడదు అన్న ఉద్దేశంతో తిరుమలలో కూడా మొదలు పెట్టారట.ఆ తర్వాత అనేక దేవాలయాల్లో మధ్యాహ్న అన్నదాన పథకానికి ఈ గుడి ఆదర్శంగా నిలిచింది.
కొసమెరుపు ఏమిటంటే..ఈ ఏడాది వేసవిలో నేను కుటుంబంతో సహా కోనసీమ వెళ్లాను. మా అమ్మాయి కావ్య ఈ మద్యనే మూడో తరగతిలోకి వచ్చింది. అందుకని మా బంగారు తల్లి మొక్కుకోక పోయినా కానీ అప్పనపల్లి దర్శనం చేయించాను. ఇదండీ నా అప్పనపల్లి ఫ్లాష్ బ్యాక్..
Sunday, August 4, 2013
మేమే అత్యంత దురదృష్టవంతులు..!
అదృష్టం, దురదృష్టం అన్నవి మన చేతిలో ఉండవు. పరిణామాలు జరిగినప్పుడు మనం అదృష్టవంతులో, దురదృష్టవంతులో తెలిసి పోతుంది.
మన సమాజంలో తల్లిదండ్రుల మాటే శిరోధార్యం. ముఖ్యంగా తండ్రి ఏం చెబితే అది వినటం, ఆచరించటం ఆనవాయితీ. దీనికి వ్యతిరేకత చెప్పటానికి కూడా సావకాశం ఉండేది కాదు. ఏది చదవమంటే అది చదవటం, ఏం చెబితే అది వినటం..ఆనవాయితీ. దాదాపుగా ప్రతీ ఇంట్లో అదే పరిస్థితి. దుస్తులు కొని పెట్టడం, వాటిని కుట్టించటం, బొమ్మలు కావాలంటే పెద్దల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి ఉండేది. తర తరాలుగా ఇదే తంతు. చిన్నప్పుడు పెద్దల చేతిలో అవస్థలు పడటం, తర్వాత పెద్దయ్యాక పిల్లలకు సుద్దులు చెప్పటం కొనసాగింది. ప్రతీ తరం ఈ విషయంలో ముందు ఇబ్బంది పడినా, పెద్దయ్యాక అధికారం చెలాయించింది.
కానీ మా తరం వచ్చేసరికి మ్యాటర్ రివర్స్ అయింది. చిన్నప్పుడు మా పెద్దల చేతిలో మగ్గిపోయిన మేం.. ఇప్పుడు మా పిల్లల చేతిలో మగ్గిపోతున్న పరిస్థితి. ఏ ఇంట్లో చూసినా పిల్లలదే ఆధిపత్యం సాగుతోంది. పిల్లలు ఏం కొనమంటే అది కొనాల్సిందే. పిల్లలు ఏ చానెల్ చూద్దామనుకొంటే ఆ చానెల్ చూడాల్సిందే. పిల్లలు ఏ కోర్స్ చదువుతామంటే దానికి ఫీజు కట్టాల్సిందే. పిల్లల కోసం మా సర్వస్వం అన్న ట్రెండ్ కొనసాగిస్తున్నాం. ఇది తప్పని చెప్పటం లేదు సుమా..!
సమాజంలో వచ్చిన ఒక మార్పుకి మా తరం వేదిక అయింది. అప్పటి దాకా కొనసాగిన ట్రెండ్ మా తరంలోనే రివర్స్ అయింది. ఇక నుంచి పిల్లల మాట నెగ్గే పరిస్థితులు కొనసాగుతాయి. మొత్తం మీద మేం మాత్రం చిన్నప్పుడు పెద్దల మాట విన్నాం. ఇప్పుడు పిల్లల మాట వింటున్నాం.. అందుచేత మేమే అత్యంత దురదృష్టవంతులం..!
Monday, July 29, 2013
మా ఊర్లో మహిళలు ఏం చేస్తున్నారంటే... వామ్మో...!
Saturday, July 13, 2013
మా ఊరు వెళ్లి వచ్చా..ఎంతటి మార్పు కనిపించిందో..!
రెండు రోజులు శెలవు పెట్టి మా ఊరు వెళితే రెండు వారాల పని బరువు నెత్తిన పడింది. దీన్ని తెముల్చుకొనేందుకు ఇంత సమయం పట్టింది. ప్రైవేటు ఉద్యోగాల్లో ఈ బరువు బాధ్యతలు తప్పవు. దీనిపై బ్లాగు రాయటానికి ఇంతటి సమయం పట్టింది.
మా ఊరు కి వెళ్లే ముందు ఈ సారి కూడా మరిచిపోకుండా గోదావరమ్మ ను పలకరించాను. రావులపాలెం కు ఇవతర సిద్దాంతం బ్రిడ్జి ఎక్కగానే కారు ఆపుదామనుకొన్నా.. పిల్లలు పడుకొన్నారు. అందుకే రావులపాలెం దాటాక మాత్రం గౌతమి గోదావరి మీద పక్కకు తీసి కారు ఆపాను. పిల్లలను లేపి గోదావరమ్మ ను చూపిస్తే ఎంత పొంగిపోయారో. అప్పటికే తెల తెల వారుతోంది. ఆ చిరు చీకట్లో గోదావరి తల్లి అందాల్ని చూస్తే మాటలు చాలవనిపించింది. పిల్లల చేత డబ్బులు వేయించాను అఫ్ కోర్స్ మా శ్రీమతి నవ్వుకొంటూనే చూసింది ఈ దృశ్యాల్ని. హైదరాబాద్ అమ్మాయిలకు ఇవన్నీ పెద్దగా పట్టక పోవచ్చు. కొద్ది సేపు అక్కడ ఎంజాయ్ చేశాకే ముందుకు కదిలాం.
వేకువ జామున మా ఊరికి వెళుతుంటే ఒక్క సారిగా సందడి నెలకొంది. ఒకప్పుడు మా ఊరి నుంచి హైస్కూల్ కు వెళితే గొప్ప. అటువంటిది ఇప్పుడు ఉదయాన్ని ఊరికి స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు పొలోమని వచ్చేస్తున్నాయి. వాటిని ఎక్కి మా ఊరి పిల్లలు చదువులకు చక చకా ముందుకు సాగుతున్నారు. ఇది చూసి భలే ముచ్చట వేసింది. నేను యూనివర్శిటీ లో చదువుకొనేటప్పుడు మా ఊరి విద్యార్థుల చదువుల గురించి బాగా ఆలోచించే వాడిని. అప్పట్లో ఒక సారి వేకువ జామున రైలు కి వెళ్లాలంటే మా ఊరాయన సైకిల్ మీద నన్ను స్టేషన్ కు దింపాడు. ఆయన అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చక్కగా కాలేజ్ బస్స్ లో వెల్లిపోతున్నాడు. ఆ సంగతి ఆయన గుర్తు చేశారు.
ఊర్లోకి వెళ్లి కాసేపు సేద తీరాక చుట్టు పక్కల వారి పలకరింపులు మొదలయ్యాయి. మా ఊర్లో అనేక కులస్తులు ఉన్నారు. కానీ అంతా మావయ్య, బాబాయ్, పెద నాన్న అని పిలుచుకొంటాం. ఎవరికి ఈ పిలుపుల మీద పట్టింపు ఉండదు. అదంతా ఒక ఆత్మీయత.
ఆ రోజు మా ఊరి శివాలయంలో కళ్యాణం. ఈ కళ్యాణం చేయించుకొనేందుకు మేం వెళ్లాం. అందుకే సాయంత్రం దేవుడి ఊరేగింపు జరుగుతుంటే కూడా వెళ్లా. ఊరంతా ఒకటే పలకరింపులు. అప్పటి పిల్లలంతా పెద్దలై పోయారు. పెద్ద వారంతా వృద్దులై పోయారు. మా అబ్బాయి అయితే బోలెడు ఆశ్చర్య పోయాడు. మీకు ఇంత సర్కిల్ ఉందా అంటే ప్రశ్నలే. వాడికి ఇదంతా కాస్త కొత్త.
రాత్రి మాత్రం దేవుడి కళ్యాణం చేయించాం. ఎంతటి మధురమైన అనుభూతో. మా ఊరంటేనే నేను పడి చస్తాను. అటువంటి చోట దేవుడి కళ్యాణం చేయించుకొన్న అనుభూతిని ఒడిసి పట్టి తెచ్చుకొన్నాను. దేవుడి సేవలో తరించే ఒక మధుర జ్ఞాపకం. అందుకే ఇప్పటికి ఆ జ్ఞాపకాన్ని దాచుకొన్నాను. మర్నాటి విశేషాలు మళ్లా చెబుతాను.
Sunday, June 16, 2013
నాలుగు రోజుల్లో మా ఊరు వెళుతున్నా. అసలు ఆ ఫీలింగే అదరగొడుతోంది..!
సొంత ఊరంటే ఎవరికైనా కాస్తంత ప్రేమ. గోదావరి జిల్లా బిడ్డలకు మాత్రం కాస్తంత ఎక్కువ ప్రేమ అన్న మాట. అటువంటి గ్రూపులో మనం టాప్ ర్యాంక్. తూర్పు గోదావరి జిల్లాలో పోస్టాఫీసు కూడా లేని అనేక పల్లెటూరుల్లో మాది కూడా ఒకటి. పక్క ఊర్లో బస్సు దిగి మా ఊర్లోకి నడుచుకొంటూ వెళ్లిపోవచ్చు. ఊరి నడిబొడ్డు నుంచి పలకరింపులు మొదలువుతాయి. పావు గంట పట్టే నడక్కి గంటం పావు ఈజీగా పట్టేస్తుంది. కనిపించిన ప్రతీవాళ్లు ముఖమంతా నవ్వు చేసుకొని మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉంటే ఆ ఆప్యాయతను దేంతో కొలవగలుగుతాం. అందుకే ఊరిలోకి వెళ్లిన కొద్ది సేపటికే వాతావరణం మారిపోతుంది. మట్టి వాసన పలకరించి పులకరింప చేస్తు ఉంటుంది.
ఊర్లోకి వెళ్లాలంటే ముందుగానే గోదావరి దాటాలి కదా.. రైలులో ఊరెళితే మాత్రం కొవ్వూరు స్టేషన్ దాటగానే గేటు లోకి వెళ్లిపోతాను. గోదావరి దాటుతుంటే కిటికీ లోంచి చూడటం కన్నా గేటు నుంచి చూడటం భలే గమ్మతుగా ఉంటుంది. అందుకే నది ని అక్కడ నుంచి చూడటం అలవాటు. యూనివర్శీటి లో ఉన్నప్పటి నుంచి మొదలైన ఈ అలవాటు ఇప్పటికీ వదల్లేదు. ఈ మధ్యన కారులో ప్రయాణం పెట్టుకొంటే రావులపాలెం వంతెన మీద మధ్య లోకి వెళ్లాక పక్కకు తీసి ఆపుతుంటాను. అప్పుడు నదిలోకి నాణేలు వేసేందుకు మా పిల్లలు కూడా పోటీ పడతారు. నదిలోకి డబ్బు వేయటం ఏంటి చాదస్తం అని నవ్వుకోవచ్చు గాక గోదావరి మీద ఇదంతా కామన్ మరి. కొన్ని ఫీలింగ్స్ కు లాజిక్కులు ఉండవు మరి.
ఊరికి వెళ్లినప్పుడు మాత్రం మొదట పరిగెత్తేది గుడిలోకే. ఎందుకంటే మా ఇంటి పక్క నే ఠీవిగా వెలసిన శివాలయం నాజీవితంతో ముడిపడి ఉంది. చిన్నప్పటి నుంచి ఆ గుడిలోనే నా ఆటపాటలు సాగాయి. అందుకే ఎప్పుడు అక్కడకు వెళ్లినా గుడికి వెళ్లి దర్శనం చేసుకోవటం మాత్రం మానను. అంతే కాదు.,, ఎంత పెద్ద క్షేత్రంలోకి వెళ్లినా ఒక్క సారైనా మా ఊరి గుడిని గుర్తుచేసుకొంటాను. అక్కడ స్వామిని మనస్సులో తలచుకొంటాను. అంతే కాదు, ఆఫీసులో పని మొదలు పెట్టేటప్పుడు కూడా ఒక్క సారి కళ్లు మూసుకొని మా ఊరి స్వామిని ధ్యానించుకొంటా. అది కూడా లాజిక్కు కు అందని బలమైన సెంటిమెంట్.
ఈ సారి కూడా కొన్ని జ్ఞాపకాల దొంతరను మోసుకొంటూ మా ఊరికి వెళుతున్నా. కొన్ని అనుభూతుల్ని పదిల పరచుకొని వెనక్కి వద్దామనుకొంటున్నా...!
Sunday, May 12, 2013
పెద్ద మాస్టారు కి మాత్రం కన్నీటి అభిషేకం..!
మా ఊరు మొత్తానికి ఒకే ఒక్క స్కూల్ ఉండేది. సమితి ప్రాథమిక పాఠశాల. అక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి దాకా క్లాసులు ఉండేవి. నలుగురు మాస్టార్లు . అందులో హెడ్ మాస్టారు ను పెద్ద మాస్టారు అని పిలిచేవాళ్లం. ఆయన పేరు చీమల కొండ సత్యనారాయణ. ఆయన వయస్సు ఎక్కువగా ఉండటం కాదు కారణం. ఆయన మా ఊర్లో ఉండే పెద్దలకు కూడా మాస్టారే. ఎందుకంటే ఆయన అప్పటికే 20-25 సంవత్సరాలు గా అక్కడ పనిచేస్తు ఉండేవారు. దీంతో మా పెద్దలు కూడా ఆయన స్టూడెంట్స్ అన్న మాట. ఆయనకు కోపం వస్తే చేతిలో ఉన్న చింత బరికె విరిగిపోయే దాకా కొట్టే వారు. ఇతర మాస్టార్లు కొడితే ఇంటి దగ్గర పెద్దలకు కంప్లయింట్ చేసుకొనే చాన్సు ఉండేది. పెద్ద మాస్టారు కొడితే మాత్రం ఎవరికి చెప్పుకొనే దిక్కులేదు. ఆయన దగ్గరకు వచ్చి కంప్లియంట్ చెప్పటానికి పెద్దలు కూడా భయపడే వారు. ఉదయం తొమ్మిది అయిందంటే ఆయన స్కూల్ లో ఉండేవారు. అప్పటికల్లా మేమంతా పరిగెత్తుకొని లైన్ లో నుంచొని ఉండేవాళ్లం. ఉదయం అసెంబ్లీ జరపటం, సాయంత్రం పిల్లల్ని ఆడించటం అన్నీ చేయించేవారు. ఉదయం ఎంత సీరియస్ గా ఉండేవారో ఆడుకొనేటప్పుడు అంతటి సరదాగానూ కనిపించేవారు. మా ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకోవటం అంటే పూర్తిగా క్రమశిక్షణతో పెరిగినవాళ్లం అన్న బ్రాండ్ ఇమేజ్ ఉండేది. అంతేకాదు,,, తర్వాత హైస్కూల్ లో చేరినా, కాలేజీకి వెళ్లిపోయినా ఆగస్టు 15, జనవరి 26 కు ఆయన స్కూల్ కు పిలిపించే వారు. జెండా కర్ర కట్టడం, స్కూల్ అంతా డెకరేట్ చేయటం వంటి పనుల్ని పెద్ద పిల్లలకు అప్పగించేవారు. కాలేజీలో క్లాసు డుమ్మాకొట్టి బజారు లో తిరిగినా, టౌన్ లో సినిమాకు చెక్కేసినా పెద్ద మాస్టారు కనబడితే మాత్రం పరుగో పరుగు.
పెద్ద మాస్టారు రిటైర్ అయినప్పుడు మాత్రం ఊరంతా కదలి వచ్చింది. అప్పటి వేసవిలో ఈ మేనెల సమయంలోనే విపరీతమైన ఎండలు నడుస్తున్నాయి. కానీ పెద్ద మాస్టారు ఫంక్షన్ కు మాత్రం అంతా కదలి వచ్చారు. ఊరందరి సమక్షంలో సార్ కు మేం పుష్పాభిషేకం చేశాం. విద్యార్థులంతా కలిసి పాద పూజ చేశాం. అటువంటి మాస్టారిని మళ్లీ చూడలేమంటూ కన్నీళ్లు పెట్టుకొన్నాం. ఊరి ప్రారంభం నుంచి ఊరేగింపుగా స్కూల్ కు తీసుకొని వచ్చాం. అక్కడ అంతా కలిసి ఆయనకు పూజలు చేశాం. పిల్లా పెద్ద అనే తేడా లేకుండా స్కూల్ ప్రాంగణం మొత్తం కిట కిట లాడిపోయింది. మా స్కూల్ కే సర్వస్వం ధారపోసిన ఆయన్ని మా ఊరు వారు ఎవ్వరూ మరిచిపోరనుకొంటాను. ఆ మహానుభావుడి సంతతి ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలని దేవుడ్ని కోరుకొంటాను.
Subscribe to:
Posts (Atom)

