ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Friday, May 15, 2015
ఈ పుట్టిన రోజు నాడు, నీవు లేవు కానీ నీ జ్ఞాపకాల వెల్లువలో తడిసిపోతా..!
ఎవరి పుట్టిన రోజు అయినా వాళ్లకు వేడుక గా ఉంటుంది. కానీ ఒకరి పుట్టిన రోజుని మరొకరు గుర్తు ఉంచుకొన్నారు అంటే కచ్చితంగా దానికో కారణం ఉంటుంది. సదరు వ్యక్తి బందువో, మిత్రులో అయ్యుండాలి. లేదా జనం అంతా గుర్తించుకొనే మంచి వ్యక్తి అయి ఉండాలి.
ఇప్పుడు నేను గుర్తు చేస్తున్న వ్యక్తి ఈ రెండో కోవకు చెందిన వారే. ఆయన పేరు సర్ ఆర్దర్ కాటన్. ముద్దుగా కాటన్ దొర గారు అని పిలుచుకొంటారు. గోదావరి నుంచి వెల్లువలా సముద్రంలోకి నదీ జలాలు పోతుంటే నదికి అటు ఇటు ఉన్న జిల్లాల్లోనే పంటలు సరిగ్గా పండని స్థితి ఉండేదట. అటువంటి సమయలో కాటన్ మహాశయుడు స్వయంగా గుర్రం మీద ఈ రెండు జిల్లాలు పర్యటించి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాలని నిర్ణయించారు. అక్కడ ఆనకట్టను నిర్మించి నీటికి అడ్డుకట్ట వేసి, అక్కడ నుంచి పంట కాల్వల ద్వారా రెండు జిల్లాలకు సరఫరా అయ్యేట్లుగా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో రెండు లేక మూడు పంటలు పండుతున్నాయంటే అది నిజంగా కాటన్ మహాశయుడి గొప్పతనమే. తర్వాత కాలంలో ధవళేశ్వరం దగ్గర ఆనకట్టను బ్యారేజ్ గా మార్చి నిర్మించినప్పటికీ, దానికి మూలస్తంభంగా నిలిచింది. కాటన్ గారే. అందుకే ఆయన జయంతి అయిన మే 15న సవినయంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నాం.
Saturday, May 2, 2015
ఆ రాణి గారి భవంతి కట్టించిన విప్లవ వీరుడు ఎవరో తెలుసా...!
రాణులు, రాజులు, రాజ్యాలు పోయాయి. కానీ వారు మిగిల్చిన గురుతులు మాత్రం మిగిలాయి. రాజులు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కోటలు, అంతఃపురాల్లో తిరుగాడిన వారు గుర్తుకొని వస్తారు. కానీ ఈ కథనం ఈ శతాబ్దపు కాలం నాటిదే, ఇంకా చెప్పాలంటే , ముప్పై, నలభై సంవత్సరాల కితం నాటిది.
తూర్పు గోదావరి జిల్లా లో ఏజన్సీ ఏరియా బాగావిస్తరించి కనిపిస్తుంది. మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, గోకవరం, ఏలేశ్వరం, రాజవొమ్మంగి వంటి ప్రాంతాల్లో ఈ అటవీ ప్రాంతం విస్తరించింది. దీనికి అంతటికి దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతంగా పెద్దాపురం ను చెబుతారు. ఇటు, మెట్ట సీమ అయిన చాగల్నాడు కి కూడ ఇదికేంద్ర బిందువు. అందుచేత ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేస్తే పిల్లల చదువులకు బాగుంటుందని ధర్మాత్ములైన పెద్దలు సంకల్పించారు. దీంతో అప్పటి మహారాజ కుటుంబాల్ని సంప్రదించటం జరిగింది. ఈ ప్రాంతంలో విద్యాభివృద్దికి, దీన జనోద్ధరణకు వాత్సవాయి రాజ కుటుంబాలు విరివిగా డబ్బులు ఖర్చు పెట్టాయి. అందులో భాగంగా కాలేజీ ఏర్పాటుకి ఈ కుటుంబం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కాలేజీ ఏర్పాటు చేయించారు. రాజా వాత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహదూర్ మహారాణి కళాశాల పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. సింపుల్ గా మహారాణి కాలేజీ అని పిలుచుకొంటారు. అంతే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు భోజనం పెట్టించాలన్న ఉద్దేశంతో మహారాణి సత్రం ఏర్పాటుచేశారు. అంటే ఈ కాలేజీలో సీటు తెచ్చుకొంటే రెండు పూటలా సత్రంలో భోజనం ఉచితంగా పెడతారు. ఇది మామూలు విషయం కాదు. కొన్ని వేలకుటుంబాల్లోని పేద విద్యార్థులు ఈ రకంగా చదువుకొని జీవితంలో స్థిర పడ్డారు. కొన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ఆ మహారాణికుటుంబానికి చెందుతుంది.
సరే, పెద్దాపురంలో కాలేజీ పెట్టారన్న సంగతి ఆ నోట, ఈ నోట ఏజన్సీ అంతా తెలిసిపోయింది. రౌతులపూడికి దగ్గరలో ఒక గ్రామం నుంచి ఒక విద్యార్థి వచ్చి కాలేజీలో చేరాడు. మొదట నుంచి విప్లవ భావాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న ఆ విద్యార్థి కాలేజీ స్టూడెంట్ యూనియన్ నాయకుడు అయ్యాడు. కాలేజీ ఉంది కానీ సరైన భవనాలు లేకపోటంతో అనేక కార్యక్రమాలు చేపట్టి, పెద్దలు మహారాణికుటుంబ సభ్యుల సాయంతో భవనాలు కట్టించారు. ఈ విధంగా తర్వాత తరం వారికి మంచిభవనాల్లో చదువుకొనే యోగం పట్టింది. ఇంతకీ ఈ విద్యార్థి నాయకుడు తర్వాత కాలంలో చెన్నై వెళ్లిపోయి సినిమాల్లో చేరాడు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా ఒక వెలుగు వెలిగాడు. ఆయన ఎవరో కాదు, విప్లవ సీనిమాల హీరో ఆర్. నారాయణ మూర్తి.
ఈ విషయాలన్నీ ఆయనే స్వయంగా చెప్పారు. మొన్న చాలాకాలం తర్వాత ఆయన్ని కలిస్తే ఈ విషయాలన్నీ నెమరు వేసుకొన్నారు. అదే కాలేజీలో చదువుకొని జీవితంలో స్థిర పడిన వ్యక్తిగా మహారాణికుటుంబాన్ని, నారాయణ మూర్తి గారు వంటి వదాన్యుల్ని గుర్తు చేసుకొంటాను.
Subscribe to:
Posts (Atom)